‘బీజేపీ రాష్ట్రాల్లో బతుకుతున్నారని గుర్తుంచుకోండి’.. బెంగాలీ కార్మికులకు సువేందు వార్నింగ్

  • వలస కార్మికులకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత పరోక్ష హెచ్చరిక
  • టీఎంసీకి ఓటేస్తే చూస్తూ ఊరుకోబోమని సంకేతాలు
  • వలస కార్మికులను బెదిరిస్తున్నారంటూ సువేందుపై టీఎంసీ ఫైర్
పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న బెంగాలీ వలస కార్మికులను ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల నందిగ్రామ్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సువేందు అధికారి ప్రసంగిస్తూ.. ‘మీరంతా గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పనిచేస్తున్నారనే విషయాన్ని మర్చిపోకండి. గుజరాత్ లో 30 వేల మంది బెంగాల్ కార్మికులు పనిచేస్తున్నారు. అందులో 1100 మంది ఇక్కడి (నందిగ్రామ్) వారే. అలాగే, ఒడిశాలో 800 మంది, మహారాష్ట్రలో 3 వేల మంది పనిచేస్తున్నారు. అక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండటం వల్లే మీరు ప్రశాంతంగా ఉపాధి పొందుతున్నారు. ఈ విషయం మీరు మరిచిపోవద్దు. మే 4 (ఎన్నికల ఫలితాల రోజు) తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురవకూడదంటే ఈ ఎన్నికల్లో పొరపాటు చేయొద్దు. మీరు బెదిరింపు చూపులతో ‘జై బంగ్లా’ అంటూ నినాదాలు చేయొచ్చు. కానీ, నేను అన్నీ రాసిపెట్టుకుంటున్నా’ అని అన్నారు. బెంగాల్ ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చి తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటు వేయడం సరికాదని, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉంటూ తమకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని పరోక్షంగా హెచ్చరించారు.

మండిపడ్డ టీఎంసీ
సువేందు వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది పేద వలస కార్మికుల పొట్ట కొట్టే ప్రయత్నమని, వారిని భయభ్రాంతులకు గురిచేయడమేనని ఆరోపించింది. ‘పని కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారిని ఓట్ల కోసం బెదిరించడం రాజ్యాంగ విరుద్ధం. బీజేపీ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సామాన్యుల జీవితాలతో ఆడుకుంటోంది’ అని టీఎంసీ నేతలు విమర్శించారు. సువేందు అధికారి వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Suvendu Adhikari
West Bengal
BJP
Bengali Workers
Migrant Workers
TMC
Nandigram
Bengal Elections
Double Engine Government
Gujarat

More Telugu News